వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా (ఎ.టి.ఎం.) గురించి ఆర్టికల్
ప్రస్తుతం అధిక సంఖ్యాక ఖాతాదారులు తమ అకౌంట్లను సరి చూసుకోవడానికి, డబ్బు తీసుకోవడానికి ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ATM,ఎటిఎం)లను, ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. కేవలం 10% కన్నా తక్కువగా బ్యాంకు లావాదేవీలు బ్రాంచ్ ల ద్వారా సాగుతున్నాయి. ఎటిఎం వాడకం పెరిగినప్పటికీ చాలా మంది కస్టమర్లు తమ ఎటిఎం సేవలను ఇంకా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. బ్యాంక్ కౌంటర్ వేళలతో నిమిత్తం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి ఉపయోగపడేదిగా 'ఎనీ టైమ్ మనీ' గా మారుపేరుతో పేర్కొంటున్న కాలం నుంచి ఇప్పుడు ఈ మెషీన్లు నగదు ఇచ్చేవి మాత్రమే కావు. ఇవి ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జి వంటి ఎన్నో లావాదేవీలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఇంటర్నెట్ అవసరాన్ని కూడా ఇవి తగ్గిస్తున్నాయి.
ఖాతాదారులు ఎటిఎం ద్వారా ఏ సేవలు పొందవచ్చో ఈ దిగువన ఇవ్వడమైనది. 1.డబ్బు విత్ డ్రా చేసుకోవడం, 2.అకౌంట్ బ్యాలెన్స్ సరిచూసుకోవడం, 3.ఎటిఎం పిన్ మార్చుకోవడం, 4.జారీ చేసిన చెక్కుల ప్రతిపత్తిని పర్యవేక్షించుకోవడంతో పాటు చెక్కు బుక్ కోసం అభ్యర్థన కూడా చేయవచ్చు. 5.అకౌంట్ స్టేట్ మెంట్ కూడా పొందవచ్చు. ఇక బ్యాంకు, ఎటిఎం మెషీన్ లను బట్టి, చెక్కులు, నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. ఏ ఖాతాదారుడైనా తన ఎటిఎం-కమ్-డెబిట్ కార్డుకు అనుసంధానించిన అకౌంట్లు చాలా కలిగి ఉన్నట్లయితే, అతను డబ్బును ఈ అకౌంట్లలోకి బదలీ చేసుకోవచ్చు బిల్లు చెల్లింపు సేవల కోసం బ్యాంకు వద్ద పేరు నమోదు చేసుకున్న తరువాత ఆ చెల్లింపు కోసం ఖాతాదారుడు తన బ్యాంకు ఎటిఎంకు వెళ్ళవచ్చు.
ఇక ఎటిఎంలల ద్వారా చెల్లించదగిన యుటిలిటీ బిల్లులు బ్యాంకును బట్టి మారిపోతుంటాయి. సాధారణంగా విద్యుత్, టెలిఫోన్, మొబైల్ బిల్లులు, బీమా ప్రీమియం వీటి ద్వారా చెల్లించవచ్చు. పలు బ్యాంకు ఎటిఎంలలో ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జి సౌకర్యం కూడా ఉంటుంది. అయితే, ఎటిఎం ద్వారా సాగించే బ్యాంకింగేతర లావాదేవీలు తిరిగి బ్యాంకు, ఎటిఎంలను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు ఎంపిక చేసిన కొన్ని కాలేజీలకు ఫీజు చెల్లింపు నిమిత్తం తన ఎటిఎంలను ఉపయోగించుకోవడానికి ఖాతాదారులను ఎస్ బిఐ అనుమతిస్తుంటుంది. అదేవిధంగా వైష్ణోదేవి, శిరిడీ సాయిబాబా, తిరుపతి వంటి ఆలయాల ట్రస్టులకు విరాళాలను కూడా బ్యాంకు కస్టమర్లు ఎటిఎంల ద్వారా పంపవచ్చు.
ATM... ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ వినియోగం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ ఏటీఎంలను బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ ఏటీఎం వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఏటీఎం కార్డును మీరు వినియోగించే సమయంలో చుట్టుపక్కల వారెవ్వరూ మీ పిన్ నెంబరు(PIN)ను గమనించకుండా జాగ్రత్త వహించాలి. కార్డు నెంబరు, పిన్ నెంబరు ఏ సందర్భంలోనూ ఇతర వ్యక్తులకు వెల్లడించవద్దు.
కొన్ని ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ జరిపేందుకు ఏటీఎంలోని స్లాట్లో కార్డును ఇన్సర్ట్ చేయాలి. కొన్ని మిషన్లలో స్వాప్ చేస్తే సరిపోతుంది. అటువంటి సమయాలలో దాని కంప్యూటర్ స్క్రీన్పైన వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి. తరచుగా ట్రాన్సాక్షన్ పూర్తి కాగానే " డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్దర్" అనే ప్రశ్న స్క్రీన్పై కనిపిస్తుంది. మరొక ట్రాన్సాక్షన్ అవసరం లేనప్పుడు నో బటన్పై క్లిక్ చేస్తే మీ పని పూర్తవుతుంది.
షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపథంలోనే ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల కార్డు ఏ సందర్భంలోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఏటీఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్ వేల్యూ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరును మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి. ఈ నెంబరు కూడా ఇతరలకు తెలియనివ్వకూడదు. ఈ నెంబరు చాలా ముఖ్యమైనది. ఈ నెంబరు మీవద్ద వుంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచైనా షాపింగ్ చేసుకునే వీలుంది.
ఏటీఎం కార్డు పోయినట్లయితే:ఏటీఎం కార్డు పోగొట్టుకున్నప్పుడు వెంటనే ఏటీఎం కార్డును జారీ చేసిన బ్యాంక్కు ఆ సమాచారం అందించాలి. ఇందుకోసం కాల్ సెంటర్లో కంప్లైంట్ నమోదు చేసుకుని కంప్లైంట్ నెంబరును నోట్ చేసుకోవాలి. మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటీఎం నెంబరును బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత మీ కంప్లైంట్ నెంబర్ ఉదహరిస్తూ మీ ప్రాంత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్(FIR)ను నమోదు చేయించుకోవాలి.