కడప ఉప ఎన్నికలపై చంద్రబాబు అయోమయం, ప్రచారం పని చేస్తుందా?

లోకసభ అభ్యర్థి ఖరారుపై చంద్రబాబు అనుసరించిన వైఖరికి నిరసనగా కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివనాగి రెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు. వారిద్దరు కాంగ్రెసు గూటికి చేరుకున్నారు. పైగా, కడప జిల్లా నాయకులు కడప ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, ఒక్కసారిగా చంద్రబాబు తానే కడప ప్రచార పర్వంలోకి దుమికారు. ఎండను లెక్కచేయకుండా కడప పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ, అక్రమాస్తులను కూడగట్టారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పర్యటనతో పార్టీ నాయకులు ప్రచార రంగంలోకి ప్రవేశించారు. పులివెందుల అభ్యర్థి బిటెక్ రవికి మాత్రం కష్టాలు తప్పేట్లు లేవు. స్థానిక నాయకులు పైకి సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా లోలోపల వ్యతిరేకంగా పనిచేయవచ్చునని అంటున్నారు.
వైయస్ జగన్ నుంచి చీలే ఓట్లు తమ పార్టీకి పడుతాయని చంద్రబాబు ఓ అంచనాతో ఉన్నారు. కానీ, ఆ అంచనాలు తప్పేట్లున్నాయి. కడప, పులివెందుల సీట్లలో ఓట్లు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థితిలో వైయస్ జగన్, కాంగ్రెసు పార్టీల మధ్యనే పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. కడప, పులివెందుల స్థానాలకు రేపు ఆదివారం పోలింగ్ జరుగుతోంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications