జగన్, తెలంగాణ అంశాలపై వైఖరే బొత్స సత్యనారాయణకు ప్లస్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చాలా స్థిరమైన వైఖరిని బొత్స సత్యనారాయణ ప్రదర్శిస్తూ వచ్చారు. సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ఆయన తన వైఖరిని వెల్లడిస్తూనే వచ్చారు. దానివల్ల తెలంగాణ నాయకుల నుంచి బొత్స సత్యనారాయణకు వ్యతిరేకత ఎదురు కాదు. అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాను ఆమోదిస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో బొత్స సత్యనారాయణ పట్ల అనుకూలత ఉంది. ఇది కూడా బొత్స ఎంపికకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంత సత్తా చాటలేకపోయారనే అభిప్రాయం కాంగ్రెసు అధిష్టానంలో ఉంది. అందువల్ల పిసిసి అధ్యక్షుడు బలమైన నాయకుడై ఉండాలనే అభిప్రాయం అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా ముఖ్యమంత్రిని గాడిలో పెట్టడానికి కూడా పనికి వస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలంగా చోటుచేసుకున్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ సమన్వయం సాధించగలరని అనుకుంటున్నారు. సోమవారం ఉదయం అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో బొత్స సత్యనారాయణ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వచ్చారు.












Click it and Unblock the Notifications