కోర్ కమిటీలో చర్చిస్తాం: తెలంగాణపై నేతలకు మన్మోహన్ సింగ్ హామీ
ఈ నెల 15వ తేదీన ప్రణబ్ ముఖర్జీతో భేటీ సమయానికి తెలంగాణపై కోర్ కమిటీలో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధాని అంగీకరించారని కేశవరావు తెలిపారు. ఎంపీలు వి.హనుమంతరావు, కేశవరావులు తెలంగాణ సమస్య మూలాలను, డిసెంబరు 9 తర్వాతి పరిణామాలను, ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులను చాలాసేపు వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిలయ్యేంత వరకూ ఢిల్లీ రావొద్దని సీనియరు నేతలు సూచించినందున వేచి ఉన్నామని, ఎన్నికలు పూర్త్తెనందున ఇప్పుడు అందరినీ కలవాలనుకుంటున్నామని కేశవరావు ప్రధానికి తెలిపారు. తాము ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, కనీసం పెళ్లిళ్లకూ హాజరయ్యే పరిస్థితి లేదని తెలిపారు. ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నా తాము కాంగ్రెస్ పార్టీకి విధేయులుగానే ఉన్నామని, కానీ ఇద్దరు ఎంపీలు అధిష్ఠానాన్ని ధిక్కరించి జగన్ పార్టీతో జతకట్టారని, సోనియాను సవాలు చేస్తున్నారని, ఇప్పటిదాకా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీహెచ్ ప్రధానికి గుర్తు చేశారు.
జూపల్లి కృష్ణారావును పరిచయం చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందీ తెలిపారు. ఆంధ్రా, రాయలసీమల్లోని సాధారణ ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేయడంలేదని, కొందరు నేతలు స్వప్రయోజనాల కోసం తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని కొందరు నేతలు ప్రధానికి చెప్పారు. సీమాంధ్రకు చెందిన భాజపా నేత వెంకయ్య నాయుడు, సీపీఐ నేత నారాయణ బహిరంగంగా తెలంగాణకు మద్దతు పలుకుతున్నారని గుర్తు చేశారు. వారిపై ఆ ప్రాంతంలో వ్యతిరేకత ఏమీ లేదని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో ఎంపీలు సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్రెడ్డి, మధు యాస్కీ, వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బలరాం నాయక్, మంత్రులు గీతారెడ్డి, సారయ్య, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, నేతలు జి.వినోద్, ఫరీదుద్దీన్ తదితరులు ఉన్నారు.