బ్లాక్ లిస్టులో వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి: టిడిపి అభిప్రాయం
టిడిపికి కాంగ్రెస్తో లింకు ఉందంటూ సాక్షి ప్రచురిస్తోన్న అసత్య కథనాల నేపధ్యంలో అప్రమత్తం గా వ్యవహరించాలని, ఈ తరహా కథనాల ను తగిన ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఇరుకున పడడానికి అవకాశం గల సందర్భాల తో పాటు, ఇతరత్రా అవసరమైన సమయాల్లో తమ వాగ్ధాటితో మీడియాలో ధీటుగా మాట్లాడే నేతలను గుర్తించడంతో పాటు అవసరాన్ని బట్టి వారికి తగిన శిక్షణ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో దాడి వీరభద్రరావు, రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చలలో పాల్గొనడం తో పాటు, పత్రికలకు ఇంటర్వూలు ఇచ్చే సందర్భాల్లో నాయకుల కు ఈ కమిటీ తగిన సమాచారాన్ని అందిస్తుంది.
ఆయా అంశాలపై ఎందుకు సంబంధిత దృక్పథానికి వచ్చిందో వివరించడం కూడా ఈ కమిటీ బాధ్యత. ఇక ఆయా సందర్భాల్లో ప్రసార సాధనాలు నిర్వహించే చర్చలకు వెళ్ళే నేతలకు ఆయా అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటైన కమిటీ తక్షణమే రంగంలోకి దిగాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. సాక్షిని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందిగా డిమాండ్ చేయాలని తెలుగుదేశం అభిప్రాయపడుతోంది. బ్లాక్ మెయిలింగ్ కథనాలకు పాల్పడుతోందన్న వాదనలు, విమర్శలతో సాక్షిపై తారస్థాయిలో ఎదురు దాడికి దిగాలని నిర్ణయించింది.