గులాం నబీ ఆజాద్కు తెలంగాణ ప్రజాప్రతినిధుల షాక్
ఇంతకు ముందు హైదరాబాదు వచ్చినప్పుడు తెలంగాణపై విన్నవించడానికి వచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధులకు సమయం ఇవ్వకుండా గెస్ట్ హౌస్ వెలుపల ఆజాద్ నిరీక్షింపజేశారు. అప్పుడే రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు వంటి నాయకులు ఆజాద్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా రాజీనామా అస్త్రాలను సంధిస్తామని ప్రకటన చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల వ్యూహం వెనక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యూహం ఫలించినట్లే చెప్పుకోవాలి.
తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం కోదండరామ్, ఇతర తెలంగాణ ప్రజా ప్రతినిధులతో కలిసి కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి వెళ్లారు. అక్కడ తీవ్ర తర్జనభర్జనల అనంతరం రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వచ్చారు. తెలంగాణ సమస్య జఠిలమైందని, దీనిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని హైదరాబాదు పర్యటనలో ఉన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెస్ అన్నారు.