చంద్రబాబు కోసమే వైయస్ఆర్ తెలంగాణం: విహెచ్
సమైక్యాంధ్ర అంటున్న నేతలను విద్యార్థులను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మా తెలంగాణ మేం తీసుకొని మా రాష్ట్రాన్ని మేం అభివృద్ధి చేసుకుంటామని చెబుతుంటే సీమాంధ్రులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. హిందీ మాట్లాడే వారికి 10 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉండటంలో తప్పేమిటని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టడం లేదన్నారు. విద్యార్థులు స్వంతగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. తెలంగాణ జాతీయ ఉద్యమంగా సాగుతోందన్నారు. టిడిపి, కాంగ్రెసు పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలో పెట్టినప్పుడూ సీమాంధ్రులు మాట్లాడలేదని తెలంగాణలో ఉద్యమం రాజుకున్నప్పుడే వారు అడ్డుకునేందుకు సమైక్యాంధ్ర అంటూ రెచ్చగొట్టే ఆందోళనలు చేపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఈ నాటిది కాదని వందల ఏళ్లుగా ఉందని 1956లో వచ్చిన ఆంధ్రులు హైదరాబాదును మేం అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరమన్నారు.
అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదన్నారు. సీమాంధ్రులకు దమ్ముంటే తాను లేకుంటే కాంగ్రెసు లేదంటున్న వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని సూచించారు. నిత్యం తెలంగాణ వారిపై విరుచుకు పడటానికి తెలంగాణ వారు అంత అమాయకంగా కనిపిస్తున్నారా అని సీమాంధ్రులను ప్రశ్నించారు. డబ్బులు ఉన్నాయని రెచ్చగొట్టే కార్యక్రమాలకు పూనుకోవద్దని సూచించారు. ఏ ఉద్యమంలోనైనా విద్యార్థులే బలవుతున్నారని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలు ఇప్పటికైనా ఆలోచించి తెలంగాణకు అడ్డు చెప్పవద్దని కోరారు. మానసికంగా ఎలాగూ విడిపోయాం కాబట్టి ఇప్పటికైనా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని సీమాంధ్రులకు విహెచ్ సూచించారు. కొందరు తెలంగాణపై అందరికంటే ఎక్కువగా స్పందిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటిని ఉద్దేశించి అన్నారు. సీమాంద్ర విద్యార్థులు నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన రాష్ట్రాలు అన్నీ అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న కావూరి సాంబశివరావులాంటి వారి ఇళ్లకు వెళ్లి తాను మాట్లాడుతానని చెప్పారు.