తెలంగాణపై మూడు ప్రతిపాదనలు, సోనియా ఆలోచన
నిర్దిష్టమైన కాలపరిమితితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నిరిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు - హైదరాబాదుపై చర్చ, రెండో ఎస్సార్సీ వేయడం - అనే మూడు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి వర్గ వునర్వ్యస్థీకరణ పూర్తి కాగానే తెలంగాణ సమస్యపై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు. కాంగ్రెసు అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణనే ఇప్పుడు తక్షణ సమస్యగా ఉంది. దాన్ని పరిష్కరించిన తర్వాతనే ఇతర విషయాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
కాగా, నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావచ్చు. ఇందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ఎలా ఒప్పించాలనే వ్యూహాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలపరిమితి పెడుతూ హైదరాబాదుపై చర్చ ప్రతిపాదనకు తెలంగాణకు చెందిన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అంగీకరించవచ్చు. అయితే, మిగతా పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు అందుకు అంగీకరించకపోవచ్చు. దాని వల్ల కాంగ్రెసు అధిష్టానానికి వచ్చే నష్టమేమీ లేదు.
హైదరాబాదును అడ్డు పెట్టి తెలంగాణపై కాలయాపన చేసే కిటుకు ఆందులో ఇమిడి ఉంటే సీమాంధ్ర నాయకులు కూడా అంగీకరించవచ్చు. రెండో ఎస్సార్సీ వేయడం అనే ప్రతిపాదనకు సీమాంధ్ర నాయకుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకులు తమ పార్టీ విధానం అదేనని అంటున్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అంగీకరించే అవకాశం లేదు. రెండో ప్రతిపాదనే ముందుకు రావచ్చు.