ముంబై పేలుళ్లలో రోడ్లపై కోట్ల విలువ చేసే వజ్రాలు
ఒపేరా హౌస్ వద్దగల ఇరుకైన ఖావ్ గల్లీ బాంబు విస్ఫోటానికి దద్దరిల్లింది. వజ్రాల వర్తకులు చెల్లాచెదురయ్యారు. బహుశ, వినటానికే ఆశ్చర్యం వేస్తుంది, నమ్మశక్యం కాదు. కాని, ఈ వర్తకులు అతివిలువైన ఈ వజ్రాల వ్యాపారాలను, వజ్రాలను తమ తమ జేబులలో వుంచుకొని సాగిస్తూంటారని ముంబై డైమండ్ అసోసియేషన్ కార్యదర్శి భరత్ వి. షా తెలియజేశారు. కొంతమంది వర్తకులు సమీపంలోని చెట్ల క్రిందా లేదా టీ స్టాళ్ళలోను కూడా తమ వ్యాపారం చేస్తూంటారట కూడాను. కొంతమంది మూసివున్న తమ గుప్పిటలో పెట్టుకొని కూడా సాయంకాలం ఏడున్నర గంటల వరకు వ్యాపారం చేస్తారు. లేదా వాటిని పోకెట్లలో దాచుకొనే చాయ్ కు లేదా బిస్కట్కు వెళుతూంటారు.
ఇదే సమయంలో బాంబు విస్ఫోటం జరగటంతో చాలామంది తమ వజ్రాలను కోల్పోయారు. అంచనాల మేరకు వీరంతా సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను విస్ఫోటంలో కోల్పోయినట్లు సంజయ్ షా చెపుతున్నారు. వారు బతికి బయటపడ్డా, ఇపుడు ఆ ప్రదేశానికి పోవటానికి పోలీసులు వారికి అనుమతి ఇవ్వటం లేదు. ఆ ప్రాంతం కావలి కాస్తున్న సెక్యూరిటీకి లేదా ఫోరెన్సిక్ నిపుణులకు ఈ వజ్రాలు దొరికి వుండవచ్చని కూడా వారు భావిస్తున్నారు.
వజ్రాల సంగతి ఏది ఏమైనప్పటికి మా మనుషుల ప్రాణాలు ఎగిరిపోయాయి. మాకు భధ్రత ఎక్కడ అని సంజయ్ షా వాపోయారు.ఈ ప్రాంతానికి స్ధానిక వర్తకులేకాక ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఈ దుర్ఘటనలో సుమారు వందమంది వరకు గుజరాతి వ్యాపారులు గాయపడి ఆస్పత్రి పాలైనట్లు, కొందరు తీవ్రంగా గాయపడగా మరి కొందరు అక్కడికక్కడే మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఫలితంగా డైమండ్ మార్కెట్ రెండు లేదా మూడు రోజులపాటు మూసివుండగలదు.