తెలంగాణపై మూడు టీమ్లు, ఆజాద్తో సీమాంధ్ర భేటీ
తెలంగాణకు చెందిన ప్రతినిధులను 5 నుంచి 10 మందిని ఆహ్వానించామని, వారితో సమావేశమైన తర్వాత రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నాయకులను ఆహ్వానిస్తామని, తద్వారా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆజాద్ భేటీ అనంతరం చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆజాద్ సూచించినట్లు మంత్రి శైలజానాథ్ భేటీ అనంతరం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. ఆజాద్తో చర్చలు సంతృప్తికరంగా సాగాయని కావూరి సాంబశివరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పనికిరాదని ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని కూడా ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు.
ఆజాద్పై తమకు నమ్మకం ఉందని, అందరితో చర్చించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరామని ఆయన అన్నారు. ఆజాద్కు తమ అభిప్రాయాన్ని తెలిపామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపామని ఆయన చెప్పారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు ఆజాద్ను కలుస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని, పార్టీ ప్రతిష్టను కాపాడడానికి సహకరించాలని ఆజాద్ సీమాంధ్ర నాయకులకు సూచించినట్లు సమాచారం. ఆజాద్తో సమావేశం ముగిసిన తర్వాత సీమాంధ్ర నాయకులు తిరిగి కావూరి నివాసంలో సమావేశమయ్యారు. రేపు మంగళవారం వారు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ మఖర్జీలను కలుస్తారు.