జగన్ వాదనలో పస ఉందా, ఆడిపోసుకోవడమేనా?
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడం కూడా చాలా మందికి నచ్చడం లేదు. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించడంపై జగన్ మీద అనుమానాలు తలెత్తతున్నాయి. తప్పు చేయకపోతే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తారనే ప్రశ్నలు వేస్తున్నారు. ఏ తప్పూ చేయకపోతే సిబిఐ దర్యాప్తును అంగీకరించి ఉండేవారని అంటున్నారు. పైగా, దాని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెసు నాయకులను, తెలుగుదేశం నాయకులను ఆయన తిట్టిపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావును తప్పు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వైయస్ జగన్ను టార్గెట్ చేసుకున్న విషయం ప్రజానీకానికంతా తెలుసు. కానీ, జగన్ వ్యవహారాలను సాకుగా తీసుకుని అవి వార్తాకథనాలను ప్రచురిస్తున్నాయి. ఆ మాటకొస్తే జగన్ సాక్షి మీడియా కూడా తన ప్రత్యర్థులపై అదే పని చేస్తోంది. పైగా, సాక్షి మీడియాలో వచ్చే వార్తాకథనాల్లో హేతుబద్దత కన్నా ఆడిపోసుకోవడమే ఎక్కువగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
మరో విషయం కూడా ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు, రామోజీరావు, ఇంకా ఎవరెవరో తప్పులు చేసి ఉంటే తన ప్రత్యర్థులు తనను ఇరకాటంలో పెట్టడానికి ఎంచుకున్న మార్గాలనే వారిపై కూడా ప్రయోగించడానికి జగన్ వర్గానికి వెసులుబాటు ఉంది. దాన్ని ఆయన ఎందుకు ఉపయోగించడం లేదనేది ప్రశ్న. జగన్ వాదనంతా మీరేమీ సొక్కం కాదనే పద్ధతిలో మాత్రమే సాగుతోంది. మీరు చేశారు కాబట్టి నేను చేస్తే తప్పేమిటనే కోణం నుంచి మాత్రమే ఆయన వాదనంతా సాగుతోంది. వారికన్నా భిన్నంగా, వారికన్నా నిజాయితీపరుడిగా, వారికన్నా ప్రజలు ఎక్కువ మేలు చేసే రాజకీయ నాయకుడిగా ఉండాలంటే జగన్ సిబిఐ విచారణను వ్యతిరేకించకుండా ఉండాల్సిందే మాట వినిపిస్తోంది.