తీహార్ జైలులో కల్మాడీ వార్డులో అన్నా హజారే
కాగా, అన్నా హజారేను కామన్ వెల్త్ కుంభకోణం కేసులో అరెస్టయిన సురేష్ కల్మాడీని ఉంచిన తీహార్ జైలులోని నాలుగో వార్డులో ఉంచినట్లు సమాచారం. హజారే అనుచరులు అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీలతో పాటు ఆరుగురిని 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి ఎ. రాజాను ఉంచిన ఒకటో వార్డులో ఉంచినట్లు తెలుస్తోంది. అవినీతిపై పోరాటం చేస్తున్నవారికీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్నవారికి జైలులో సమన్యాయం చూపారని భావించవచ్చునని దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.
జన్ లోక్పాల్ బిల్లు కోసం ఢిల్లీలోని జయప్రకాష్ నారాయణ్ పార్కులో నిరాహార దీక్ష తలపెట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారేను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అన్నా టీం సభ్యులు కేజ్రీవాల్, కిరణ్ బేడీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని ఆపేది లేదని అన్నా హజారే అన్నారు. నిరసనకారులు సహనం వహించి, శాంతి పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీనియర్ పోలీసు అధికారులు ఉదయమే అన్నా హజారే వద్దకు వచ్చి గృహనిర్బంధం విధించినట్లు చెప్పారు. ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆదేశించారు. పోలీసులను ఎదుర్కుని ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు హజారేతో పాటు కిరణ్ బేడీ, కేజ్రీవాల్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. తన అరెస్టు ద్వారా మరో స్వాతంత్ర్యోద్యమం ప్రారంభమైందని అన్నా హజారే అన్నారు.