జగన్ వర్గం ఎమ్మెల్యేల బస్సు యాత్రకు బ్రేక్లు
వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మను ముందు పెట్టి రాజీనామా చేయని ముగ్గురితో పాటు రాజీనామా చేసిన 26 మంది బస్సు యాత్ర చేపడతారని అనుకున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను కూడా వారు రూపొందించుకున్నట్లు చెబుతారు. అయితే ప్రస్తుత స్థితిలో బస్సు యాత్ర చేపడితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చుననే అనుమానంతో బస్సు యాత్రను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. పైగా, తెలంగాణలో పర్యటించే స్థితి వారికి లేదు. సిబిఐ దర్యాప్తు జరిపితే తప్పేమిటనే భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని, సిబిఐ దర్యాప్తులో జగన్ నిర్దోషి అని తేలితే మంచిదే కదా అనే సమస్య కూడా ముందుకు వస్తుందని భావించి బస్సు యాత్ర నుంచి వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
మరో వైపు, రాజీనామాలు చేసినవారు వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్తో ఉంటే ఎటూ కాకుండా పోతామనే ఆందోళన కొంత మందిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి పాల్గొనడం కూడా చర్చనీయాంశంగా మారింది. అలా మరింత మంది శాసనసభ్యులు వెనక్కి రావచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనివల్ల కూడా బస్సు యాత్ర కార్యక్రమానికి దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. కాగా, వైయస్ జగన్ ఎల్లుండి నుంచి కృష్ణా జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు.