వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు జారిపోతారా?
ఇప్పటికే జగన్కు అత్యంత సన్నిహితుడని భావించిన గుర్నాథ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి జై కాంగ్రెసు నినాదం చేయడంతో ఆ అనుమానాలు ప్రారంభమయ్యాయి. తాజాగా, జయసుధ వ్యవహారంతో మరింత బలపడుతున్నాయి. వైయస్ జగన్ సిబిఐ కేసులో ఇరుక్కోవడంతోనే చాలా మంది డైలమాలో పడినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ యాత్ర విఫలం కావడం, జగన్కు అండగా రాజకీయ నాయకులు ముందుకు రావడానికి ఇష్టపడకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై జగన్ వర్గం శాసనసభ్యుల్లో ఆందోళన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గతంలో 26 మంది, ఇప్పుడు ఇద్దరు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలపై శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తమ రాజీనామాలను ఆమోదించవద్దని కొంత మంది శాసనసభ్యులు స్పీకర్ను వేడుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద, జగన్ వర్గంలో గందరగోళం మాత్రం పెరుగుతోంది.