విప్ ధిక్కారంపై కాంగ్రెసు సీరియస్, ఎంపీలకు షోకాజ్
విప్ జారీ చేసినప్పటికీ గైర్హాజరు కావడాన్ని తాము చాలా సీరియస్గా పరిగణిస్తున్నామన్నారు. అయితే కొందరు ఎంపీలు ఫోన్లు, ఎస్సెమ్మెస్ల ద్వారా తెలిపారన్నారు. కేంద్ర మంత్రి పవర్ కుమార్ బన్సాల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఓటింగుకు గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కాగా మన రాష్ట్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేదని కోమటిరెడ్డి వివరణ పంపగా, రాజీనామా చేసిన కారణంగా మేకపాటి హాజరు కాలేదని సమాచారం.
టిడిపికి చెందిన ఆరుగురు ఎంపీలు చర్చలో పాల్గొని ఓటింగుకు హాజరు కాలేదు. టిఆర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లోక్పాల్ బిల్లు చర్చలో పాల్గొనలేదు.
కాగా బుధవారం రాజ్యసభకు రావాల్సిన లోక్పాల్ బిల్లు గురువారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగువ సభ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తేనే ఎగువ సభలో ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ప్రతిభా పాటిల్ హైదరాబాదులో ఉన్నందున ఆమోదించిన బిల్లును బుధవారం హైదరాబాద్ పంపి సంతకం చేయించి గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.