పంతం నెగ్గించుకున్న ముఖ్యమంత్రి: విస్తరణకు ఒకె
కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు ముగించుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతూ విమానాశ్రయంలో - "రాబోయే రెండు మూడు రోజుల్లో (విస్తరణ) అంతా అయిపోతుంది'' అని ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి మంత్రి వర్గ విస్తరణకు అవకాశం లభించిందని అనుకోవచ్చు. మంత్రివర్గంలో భారీ మార్పులు ప్రస్తుతానికి లేదు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుతానికి తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు, కొన్ని శాఖలను పునర్వ్యవస్థీకరించేందుకు సీఎం కిరణ్కు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు, ఉప ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కేబినెట్ పునర్వ్యవ స్థీకరణపై తాము పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో శనివారం రెండు గంటల పాటు చర్చలు జరిపిన సీఎం ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ చర్చించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారమంతా ఏపీ భవన్లో కసరత్తు జరుపుతూ - ఆజాద్తో ఫోన్లో మాట్లాడుతూ గడిపారు. సోనియా గాంధీ, ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్తో కిరణ్ ఆదివారం సాయంత్రం దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. మంత్రివర్గ విస్తరణతో పాటు ఉప ఎన్నికల్లో వ్యూహరచన, రాష్ట్ర రాజకీయ పరిస్థితి, మీడియాలో జరుగుతున్న ప్రచారం, రాజీవ్ యువకిరణాలు మొదలైన అనేక అంశాలపై అధిష్ఠానానికి ఈ భేటీలో కిరణ్ వివరించారు. ప్రధానంగా మద్యం సిండికేట్, ఏసీబీ దాడుల గురించి సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్కు అధిష్ఠానం సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.