వైయస్ జగన్ ప్లాన్: వైయస్ మంత్రులపైకి మళ్లింపు
వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసి ప్రస్తుతం వైయస్ జగన్ వైపు ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ద్వారా ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తున్నవారిని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి తదితర మంత్రుల పాత్ర వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాల్లో ఉందనే వాదన వినిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నిర్ణయాల్లో మంత్రుల సమిష్టి బాధ్యత ఉంటుందని, అయితే దాని అమలు విషయంలో ఉండదని పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు అంటున్నారు.
ఐఎఎస్ అధికారుల వాదనకు అంతగా మద్దతు లభించకపోయినప్పటికీ రాజకీయ నాయకులను వదలకూడదనే వాదనకు బలం చేకూరుతుంది. ప్రతిపక్షాలు ఈ విషయంలో బలంగానే తమ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఎవరి పాత్ర ఉందనేది సిబిఐ తేలుస్తుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో పూర్తిగా సిబిఐ దర్యాప్తు తీరునే వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తప్పు పడుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా కాంగ్రెసు పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందని, సిబిఐ అందుకే చంద్రబాబును వదిలేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. ఏమైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదనలు కాస్తా గందరగోళానికి కారమవుతున్నాయి.