చిరంజీవి, కిరణ్ రెడ్డి, జగన్లపై శివాలెత్తిన చంద్రబాబు
ముఖ్యమంత్రి పోలవరం టెండర్ల విషయంలో టిఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఒరిజినాలిటీ ఉండాలన్నారు. అది లేకుంటే ఎవరూ రాణించలేరన్నారు. ఇందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే మంచి నిదర్శనమన్నారు. ఆయన తాను ప్రధానిని కాలేనని తెలిసే తనకు ఆ పదవిపై మక్కువ లేదంటున్నారని అన్నారు. తన కుటుంబానికి గానీ, నందమూరి కుటుంబానికి గాని ఎలాంటి రాజకీయ వారసత్వం లేదని ఆయన అన్నారు. సత్తా లేని వారు రాజకీయాల్లో రాణించలేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అలాంటి అవినీతికి పాల్పడిన వారికి లక్షల విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆస్తులకు తాను, ఎన్టీఆర్ ట్రస్టీలుగా ఉన్నామని, కాంగ్రెసు మాత్రం దోచుకుంటోందన్నారు.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కీలు బొమ్మ అని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణకు అన్ని మద్యం దుకాణాలు ఎలా వచ్చాయన్నారు. తనకు దుకాణాలు ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. కాగా అంతకుముందు బైక్ ర్యాలీతో ఆయన యువతరంగం కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు స్వయంగా బైక్ నడపడంతో యువత కేరింతలు కొట్టింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరయింది.