మార్చి 18న తెలంగాణ ఉప ఎన్నికలు, కొవ్వూరుకూ
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహబూబ్నగర్, నాగర్కర్నూల్, స్టేషన్ఘన్పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి, కోవూరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మహబూబ్నగర్: రాజేశ్వర్రెడ్డి స్వతంత్ర సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. ఆయన మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.
నాగర్కర్నూలు: నాగం జనార్దన్రెడ్డి టీడీపీ నుంచి సస్పెండయ్యి, తర్వాత రాజీనామా చేశారు
కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టి, దానికి రాజీనామా చేసి తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరారు.
స్టేషన్ఘన్పూర్: టి. రాజయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని రాజీనామా చేశారు.
కామారెడ్డి: గంప గోవర్ధన్ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఆదిలాబాద్: జోగు రామన్న టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి టీడీపీ తరఫున గెలిచి జగన్ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ పార్టీ నుంచి సస్పెండయ్యారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడు కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.
మన రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు.. మన్సా (గుజరాత్), పిరవోం (కేరళ), శంకరన్ కోవిల్ (ఎస్సీ-తమిళనాడు), అత్గర్ (ఒడిసా). ఇవి కాక, ఒకే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం... ఉడిపి (కర్ణాటక).నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే.. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలున్న జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.