తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబే బహిష్కరించారు: టిఆర్ఎస్
తెలంగాణకు చెందిన శ్రీధర్ బాబే సస్పెండ్ తీర్మానం ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వచ్చే వరకు పదవులు వద్దని పలికిన శ్రీధర్ ఇప్పుడు తమనే బహిష్కరించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇది చీకటి రోజు అని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే టిడిపి, కాంగ్రెసులకు తెలంగాణ గుర్తుకు వస్తుందన్నారు. వారంతా తెలంగాణ ద్రోహులేనన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఉన్నారని కానీ తెలంగాణ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. మేం పోడియం వద్దకు వెళితే టిడిపి తెలంగాణ నేతలు ఎవరూ సభలో లేరన్నారు. ఇదేమి మ్యాచ్ ఫిక్సింగో తెలపాలన్నారు. ఈ సభ తెలంగాణకు న్యాయం చేయదన్నారు. కాంగ్రెసు, టిడిపిలు తెలంగాణపై ఇచ్చిన మాట తప్పాయని బిజెపి నేతలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ అన్నారు.