తనయుల కోసం లోకసభ సీట్లపై కన్నేసిన నేతలు

రాష్ట్ర రాజధాని నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపైనా హోరాహోరీ మొదలయింది. రానున్న ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నానని మంత్రి ముఖేష్ పేల్చిన బాంబు కాంగ్రెస్లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. అంజన్ కావాలంటే ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సలహా ఇచ్చారు. సికింద్రాబాద్ నీ జాగీరు కాదని, నా నియోజకవర్గానికొస్తే ఖబడ్దార్, నీ బండారం బయటపెడతానని సిట్టింగ్ ఎంపీ అంజన్కుమార్యాదవ్ నేరుగానే మంత్రిని హెచ్చరించారు. దానిపై మళ్లీ స్పందించిన ముఖేష్ సికింద్రాబాద్ తన జాగీరేనని, తాను పోటీ చేసేది ఖాయమని ముఖేష్ విస్పష్టంగా తేల్చి చెప్పారు.
మల్కాజిగిరి లోకసభ స్థానంలో సర్వే సత్యనారాయణకు ఎసరు పెట్టడానికి శాసనసభ్యుడు రాజిరెడ్డి సిద్ధపడ్డారు. తాను పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు రాజిరెడ్డి చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సర్వే పోటీ చేస్తే ఓడిపోతారని ఆయన అన్నారు. మల్కాజిగిరి పరిధిలోని ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యుల అబిప్రాయం కూడా ఇదేనని ఆయన అన్నారు. తాము మల్కాజిగిరి లోకసభ సీటుకు అభ్యర్థిని తయారు చేస్తామని అన్నారు.
తాడిపత్రి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న జెసి దివాకర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డిని పోటీకి దించేందుకు ఆయన ఈ ఏర్పాటుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ లోకసభ స్థానం నుంచి కేంద్రమంత్రి జైపాల్రెడ్డి వేరే నియోజకవర్గానికి వెళితే, తాను అక్కడి నుంచి పోటీ చేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. తాను ఖాళీ చేసిన మహేశ్వరం నుంచి తనయుడిని పోటీ చేయించాలని యోచిస్తున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి కూడా పార్లమెంటు సీటుపై మనసు పారేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేస్తానని ముందస్తుగానే ప్రకటించారు.












Click it and Unblock the Notifications