జగన్ ఎమ్మెల్యేలపై వేటుకు ఆ ఎన్నికలే కారణమా?
నిజానికి, రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా చూసుకోవడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్పై ఒత్తిడి తెచ్చే వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయడంలో జాప్యం జరిగేలా చూశారనే ప్రచారం ఉంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరుకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటితో పాటు మిగతా 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరగడానికి వీలు లేకుండానే స్పీకర్ వేటు వేశారు. కాంగ్రెసు అధిష్టానం ఆదేశాల మేరకే పనిచేస్తున్న స్పీకర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే స్పీకర్ శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో అవగాహనకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభకు తమ అభ్యర్థిని పోటీకి దించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే వైయస్ జగన్ వర్గంపై వేటు వేసినట్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే, వైయస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ ఆయన కొద్ది కాలంగా లాబీయింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్న కె. కేశవరావు కూడా శనివారం ముఖ్యమంత్రిని కలిశారు.