కిరణ్ కుమార్ రెడ్డే టార్గెట్, సిఎంగా దించడమే లక్ష్యం

కాంగ్రెసు నాయకులు విడివిడిగా కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారి విమర్శల్లో ఏకసూత్రత, ఉమ్మడి లక్ష్యం ఉందని అంటున్నారు. పథకం ప్రకారమే కాంగ్రెసు అసమ్మతి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించడంతో ప్రారంభమై కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి కొనసాగుతోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఏకంగా తన రాజీనామా లేఖను సోనియా గాంధీకే పంపించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా తన రాజీనామా లేఖను ఆయన సోనియాకు పంపించారని అంటున్నారు.
కాగా, మాజీ మంత్రి పి. శంకరరావు సరేసరి. ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపైనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మిగతా నాయకులు ప్రధానంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు వైయస్ రాజశేఖర రెడ్డితో పోలుస్తూ కిరణ్ కుమార్ రెడ్డిపై వాగ్బాణాలు సంధించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై దాడికి వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. రానున్న 18 స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కునే సమర్థత కిరణ్ కుమార్ రెడ్డికి లేదనే సంకేతాలను పార్టీ అధిష్టానానికి బలంగా పంపించడమే అసమ్మతి వర్గం ఆలోచనగా చెబుతున్నారు. ఈ పథకరచనలో భాగంగానే గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ డిఎల్ రవీంద్రా రెడ్డితో సమావేశమైనట్లు చెబుతున్నారు. ఏమైనా, ఈ గండాన్ని గట్టెక్కడం ముఖ్యమంత్రికి కనాకష్టమే అవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications