లగడపాటి, రేణుక, సిఎంపై ఆజాద్కు టి-ఎంపీల ఫిర్యాదు
తెలంగాణపై కేంద్రం ఏదైనా ప్రక్రియ ప్రారంభిస్తే వెంటనే ప్రకటన చేయాలని లేదంటే వెంటనే బిల్లు పెట్టాలని వారు ఆజాద్ను కోరినట్లుగా తెలుస్తోంది. వెంటనే అధిష్టానం కూడా తన వైఖరి తెలపాలని వారు డిమాండ్ చేశారని తెలుస్తోంది. లేదంటే ఇవాళ కూడా లోకసభను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. వారు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరిల, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. కిరణ్ ఒంటెద్దు పోకడతో వెళుతున్నారని చెప్పినట్లుగా సమాచారం. ఆ తర్వాత బుధవారం మరోసారి సమావేశమౌదామని ఆజాద్ ఎంపీలతో చెప్పి సమావేశాలకు వెళ్లారు.
లోకసభ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్కు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు నోటీసు అందజేశారు. కేంద్రం ప్రత్యేక తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టాలని ఈ సందర్భంగా నామా కోరారు. మరోవైపు ఏఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఈయన రాష్ట్ర వ్యవహారాల విషయంలో ఆజాద్కు సహాయకుడిగా ఉన్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వివరాలు సేకరించి ఆజాద్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.