జగన్తో గొడవపడి వైయస్ హెలికాప్టర్ ఎక్కారు!: వర్ల
వైయస్కు ఎప్పుడూ అత్యంత నమ్మకంగా ఉంటూ భద్రత వ్యవహారాలు చూసే సూరీడు ఈ కారణంగానే జగన్ దగ్గరకు వెళ్ళకుండా దూరంగా ఉండిపోయినట్లుగా వింటున్నామని ఆయన చెప్పారు. అలాగే వైయస్ ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు కూడా జగన్తో కలవకుండా దూరంగా ఉండడానికి కారణమిదేనా? అని ప్రశ్నించారు. వైయస్ చనిపోయిన మర్నాడు అందరూ ఆ పరిణామానికి విషాదంలో మునిగిపోయి ఉంటే జగన్ మాత్రం తన తండ్రి పదవిని సంపాదించుకోవడం కోసం సంతకాల సేకరణలో మునిగితేలాడని, ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రీ కోరుకోడని మండిపడ్డారు. అప్పట్లో తన మాట వినని అధికారులను బెంగళూరు తీసుకెళ్ళి జగన్ నెలల తరబడి బంధించాడని, ఆయన బండారం బయటపెడతామని చెప్పారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల వర్ల తీవ్రంగా ప్రతిస్పందించారు. జూపూడి మాటలు సభ్య సమాజంలోని వ్యక్తుల మాటల్లా లేవని ధ్వజమెత్తారు. ఆకాశంలో నక్షత్రం వెలిగిందంటే చంద్రబాబు సమాధానం చెప్పాలా? చంద్రబాబు ఢిల్లీకి బహిష్కృతుడా? ఢిల్లీ వెళ్ళకూడదా? జగన్ కారుకు వెనుక టైరు పగిలిపోతే దానికి కూడా చంద్రబాబే సమాధానం చెప్పాలా? అని వర్ల ప్రశ్నించారు. ఒక మిత్రుడి తల్లి చనిపోతే అతనిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారని, దానిమీద కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మాట్లాడడం జూపూడికి తగుతుందా అని నిలదీశారు.
మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వైయస్సార్ కాంగ్రెస్కు అలవాటేనని దుయ్యబట్టారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ప్రధాని పాదాలవద్ద సాగిలపడి, ఆ తర్వాత మీ అధినేత జగన్ ఏం మాట్లాడాడో సాక్షి పత్రికలు తిరగేసి చూసుకోవాలని జూపూడికి హితవు పలికారు. జగన్ ఒక అవినీతిపరుడని, కోట్ల రూపాయలు కొట్టేశాడని సిబిఐ చార్జిషీట్ వేసిందని, అలాంటి జగన్ రోడ్లపై నిస్సిగ్గుగా తిరగవచ్చా? మేం మాత్రం ఢిల్లీకి వెళ్ళకూడదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపరుడని ఆధారాలతో నిరూపిస్తానని, నా చాలెంజ్కు సిద్ధమా అని జూపూడికి సవాల్ విసిరారు.