రామోజీ ఈనాడుపై రచయిత్రి మాలతీ చందూర్ ఫైర్

పొట్టి శ్రీరాములు స్మారక మందిరాన్ని అద్దెకు ఇవ్వనున్నట్లు ఈనాడులో తప్పుడు వార్తాకథనాలు అచ్చయ్యాయని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ కథనాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాసిందే జర్నలిజం అనుకుంటున్నారా అంటూ ఆమె ఈనాడు పత్రికా రచయితలపై మండిపడ్డారు. వాస్తవాలను దాచి అసత్యాల్సి ప్రచారం చేస్తే సహించేవారు లేరని ఆమె వ్యాఖ్యానించారు.
పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కోసం యేటా ప్రభుత్వం రెండు లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తోందని, దాన్ని భవన నిర్వహణకు వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నాయని గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తెస్తే లక్ష రూపాయల గ్రాంట్ను రెండు లక్షల రూపాయలకు పెంచారని ఆమె చెప్పారు. ఏటా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతులను, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను తాము ఆ స్మారక మందిరంలో నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు.
మాలతీ చందూర్కు తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉంది. ఆమె ఎన్నో రచనలు చేశారు. ఆమె ఓ పత్రికలో పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు విశేషంగా ఆదరణ పొందాయి. ఆమెకు పలు అవార్డులు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications