ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో హీరో బాలకృష్ణ భేటీ
ముఖ్యమంత్రి, బాలకృష్ణ ఇద్దరూ మంచి మిత్రులు. నిజాం కళాశాలలో వీరు క్లాస్ మేట్స్. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రితో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో దాదాపు గంట సేపు మాట్లాడారు.
లండన్, కువైట్, వాషింగ్టన్ తదితర ప్రాంతాలలో బాలకృష్ణ పర్యటించారు. ఆ సమయంలో ఆయన రాజకీయాలు కూడా మాట్లాడారు. విదేశాల్లో ఉన్న తెలుగువారిలో మూడొంతులకు పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులేనని ఆయన లండన్లో ఎన్నారై టిడిపి కార్యకర్తలు, పార్టీ అభిమానుల సమావేశంలో చెప్పారు. తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు.
ఇకపై టిడిపిలో యువతదే ప్రముఖ పాత్ర అని చెప్పారు. రాజకీయాల్లో అవినీతిని, దగాకోరుతనాన్ని అడ్డుకోవడానికి యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అనుసరించిన విధానాల మూలంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్షల మంది యువకులకు విదేశాల్లో ఉపాధి లభించిందన్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ పార్లమెంటును సందర్శించారు.
వాషింగ్టన్లో పర్యటించిన ఆయన అవినీతిని, అస్తవ్యస్థ పరిస్థితులను అంతం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలకృష్ణ అప్పుడు చెప్పారు. ఆయన లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో శుక్రవారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు దిగజారాయని, నేతల్లో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. యువత ముందుకు వచ్చి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తద్వారా రాజకీయాల్లో అవినీతి తగ్గుతుందన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని అన్నారు. తన తల్లి బసవతారకం పేరిట హైదరాబాదులో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కాగా కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అంటూ పలువురు పెద్దపెట్టున నినాదాలు చేశారు.