జగన్ గెలిస్తే తెలంగాణ ఇస్తారని చెప్పలేను: లగడపాటి

తెలంగాణ సమస్యను పరిష్కరించే శక్తి, చేవ లేదని కాంగ్రెసేతర పార్టీలు అంటున్నాయని, తాము మాత్రమే పరిష్కారం చేయగలమని ఆయన అన్నారు. సమస్యకు కాంగ్రెసు పార్టీ ఒక్కటే కారణం కాదని, పార్టీలన్నీ కారణమేనని ఆయన అన్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పిందని, ఆ తర్వాత అన్ని పార్టీలూ చేతులెత్తేశాయని ఆయన అన్నారు. అందరూ చేతులెత్తేసినా తాము సమస్యను పరిష్కరించగలమని, ఆ శక్తి తమకు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. తాము కుర్చీ కోసం పనిచేయడం లేదని, బాధ్యతాయుతమైన నాయకులుగా ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతామని ఆయన చెప్పారు.
వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తాము తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేల కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయిస్తామని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తాము ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చెప్తామని ఆయన అన్నారు. ఇందుకు తాము వరంగల్ జిల్లా పరకాల నుంచి పాదయాత్ర ప్రారంభించి 18 నియోజకవర్గాల్లో తిరుగుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు మాత్రమే తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని చెప్తామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు సమస్య పరిష్కారం తమ వల్ల కాదని చెబుతున్నాయని, సమస్యను పరిష్కరించే సత్తా తమకు ఉంది కాబట్టి తమ పట్ల ప్రజలు ఆదరణ చూపాలని ఆనయ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాస, బిజెపి లోపాయికారి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో తెరాస తన క్యాడర్తో బిజెపికి ఓట్లేయించిందని, మతపరమైన భావనతో బిజెపిని గెలిపించిందని, మహబూబ్నగర్లో బిజెపి గెలిచిన తర్వాతనే హైదరాబాద్, సంగారెడ్డిల్లో మతఘర్షణలు జరిగాయని ఆయన విమర్శించారు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం వచ్చిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. జగన్ గెలిస్తే కేంద్రం తెలంగాణ ఇస్తుందని అనుకోవచ్చా అని అడిగితే ఆ విషయం తాను చెప్పలేనని ఆనయ సమాధానమిచ్చారు. జగన్, చంద్రబాబు శక్తిహీనులని, సమస్య పరిష్కరించే శక్తి లేదు, ముఖ్యమంత్రి పీఠంపై కోర్చోవడానికి మాత్రమే తాము అర్హులమని వారంటున్నారని, అందువల్ల తాము స్పష్టమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెసు తప్ప మిగతా పార్టీలన్నీ స్వార్థంతో పనిచేస్తున్నాయని, మహాకూటమి గెలిస్తే హైదరాబాదుకు వెళ్లడానికి పాస్పోర్టు కావాల్సి వస్తుందని నంద్యాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గత ఎన్నికల సందర్భంలో నంద్యాలలో అన్నారని, తాము గెలిస్తే తెలంగాణ అనుకూలంగా తీర్మానం చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మిగతా పార్టీలను తాము తమ దారికి తెచ్చుకుంటాం గానీ లొంగిపోబోమని, చంద్రబాబు లొంగిపోయారని ఆయన అన్నారు. 2004 ఎన్నికల్లో కూడా తెరాసను తమ దారికి తెచ్చుకుని రెండో ఎస్సార్సీకి కెసిఆర్తో సంతకం చేయించామని ఆయన చెప్పారు. తాము లొంగదీసుకుంటే చంద్రబాబు లొంగిపోయారని ఆయన అన్నారు. ఎవరినైనా లొంగదీసుకునే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన చెప్పారు.
కాంగ్రెసు అత్యధిక సీట్లు సాధించకపోతే ప్రజలు తెలంగాణకు అనుకూలంగా ఓట్లేశారని అనుకోవచ్చా అని అడిగితే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తమకు ఓట్లేసి, గెలిపిస్తే సమస్య పరిష్కారానికి తమకు శక్తి ఇచ్చినవారవుతారని ఆయన అన్నారు. తాను రాష్ట్ర విభజన గురించి మాట్లాడడం లేదని, సమస్య పరిష్కారం గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. వైయస్ ఫొటోతో ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తే కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. తమ అధినాయకురాలు సోనియా గాంధీ అని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తమ నాయకులని, తామంతా చర్చించుకుని కలిసికట్టుగా ఉప ఎన్నికలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ను అరెస్టు గురించి అడిగితే జగన్ అరెస్టు చేయాలా, వద్దా అనేది, ఎవరిని అరెస్టు చేయాలనేది న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఏం జరుగుతుందో ముందు ముందు మీరే చూస్తారు కదా అని ఆయన అన్నారు. వైయస్ జగన్ అస్తుల కేసులో మొదటి చార్జిషీట్ను సిబిఐ కోర్టులో దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications