సూట్కేస్ బాంబు కేసులో జగనే ఫస్ట్ ముద్దాయి!: బాబు
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ నేర చరిత సినిమా వాళ్ల ఊహకు కూడా అందని విధంగా ఉందన్నారు. ఎమ్మార్, ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు జైలు బాట పట్టారన్నారు. ఈ దేశం ఎక్కడకు పోతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆస్తుల కేసును సిబిఐ విచారణ నిర్ధారిస్తుందని చెప్పారు.
సూటుకేసు బాంబు కేసును అఫ్పట్లో వైయస్ వెనుకేసుకొచ్చారన్నారు. జగన్ను ఈ కేసు నుండి జగన్ను తప్పించడానికే మంగళి కృష్ణ పేరును తెర పైకి తీసుకు వచ్చారన్నారు. ఈ కేసులో పదకొండేళ్ల తర్వాత తీర్పు వెలువడిందన్నారు. పరిటాల రవి హత్య కేసులో మంగళి కృష్ణ ముద్దాయి అన్నారు. కృష్ణను వైయస్ సమర్థించారన్నారు.
సెంటిమెంట్, దౌర్జన్యాల పేరుతో రూ.800 కోట్లు సంపాదించారని విమర్శించారు. సూరిని హత్య చేసేందుకు మంగళి కృష్ణనే డబ్బులు సమకూర్చారని ఆయన ఆరోపించారు. 2001 నుంచే జగన్ క్రిమినల్స్తో సంబంధాలు నెరపుతున్నారన్నారు. సూరి జైలులో ఉండగా జగన్, మంగళి కృష్ణ ఆయనను కలిశారన్నారు. జైలులో ఉండగానే కొందరిని చంపిస్తున్నారని, జైలు బయటకు వచ్చిన వారిని చంపిస్తున్నారన్నారు.
అధికారం, తుపాకులతో మాఫియా రాజ్యాన్ని సృష్టించారన్నారు. మాఫియా రాజ్యంలో సొంత ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కొన్ని పత్రికలు అడ్డదిడ్డంగా వార్తలు రాస్తున్నాయని జగన్కు చెందిన సాక్షి పత్రికపై ఆయన మండిపడ్డారు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో రాస్తారన్నారు.
మొద్దు శీను, మద్దెలచెర్వు సూరి హత్యలు, భాను కిరణ్ అరెస్టులు ఇవన్నీ కలిపి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలన్నింటికీ కారకుడు జగనే అని ఆరోపించారు. నేరంపై ప్రశ్నిస్తే కోర్టులు, పోలీసులు, ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారన్నారు. నేరం జరిగితే అధికారపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
నేరస్థులు కూడా హీరోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిపై అన్ని పార్టీలు మౌనం వీడాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తే రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరిగి ఉండేవి కావన్నారు.