టైం ఇచ్చినప్పుడే!: బిజెపిలో చేరికపై రాజశేఖర్, జీవిత
దీంతో రాజశేఖర్, జీవితలు కూడా బిజెపి తీర్థం పుచ్చుకునే విషయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. వెంకయ్య నాయుడు వచ్చినప్పుడే ఆయన సమక్షంలోనే బిజెపిలో చేరతామని వారు రాష్ట్ర నేతలకు చెప్పారట. బుధవారం వెంకయ్య నాయుడు హైదరాబాద్ వస్తున్నారని తెలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
అనుకున్న తేదికి చేరాలని బిజెపి రాష్ట్ర నేతలు కోరినప్పటికి వారు సున్నితంగా తిరస్కరించారట. వెంకయ్య సమయం ఇచ్చి వచ్చినప్పుడే చేరతామని చెప్పారట. కాగా వీలైనంత త్వరలోనే రాజశేఖర్ దంపతులు బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా సినీ హీరో రాజశేఖర్, జీవిత బిజెపిలో చేరనున్నట్టు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో రాజశేఖర్, జీవిత మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వారిద్దరు రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నేపథ్యంలో వారు అప్పుడు కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి వారిద్దరిని కాంగ్రెసులోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వారు కొంత కాలం వైయస్ జగన్తో ఉన్నారు. కానీ వైయస్ జగన్తో వారికి పొసగినట్లు లేదు. దాంతో జగన్కు వారు దూరమయ్యారు.
తెలుగుదేశం పార్టీలో చేరడానికి జీవిత, రాజశేఖర్ తీవ్రంగానే ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు పెట్టిన షరతులు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నచ్చలేదని, దాంతో తెలుగుదేశం పార్టీలో వారిని చేర్చుకోలేదని వార్తలు వచ్చాయి. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
చివరకు బిజెపిలో చేరడానికి రాజశేఖర్, జీవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి నాయకులతో వారు చర్చలు జరిపి, తమకు ఇమేజ్కు తగిన విధంగా వెంకయ్యనాయుడి సమక్షంలో బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి, రాజశేఖర్ దంపతులకు మధ్య ఏ మాత్రం పడదు.