కాంగ్రెస్కు రాజీనామా యోచనలో గంగుల, జగన్ గూటికే
కాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీపై వ్యాఖ్యానించేందుకు గంగుల ప్రతాప్ రెడ్డి నిరాకరించారు. ఆళ్లగడ్డలో తాను మాత్రం పోటీ చేయడం లేదని చెప్పారు. పార్టీ అభ్యర్థి ఎవరో తనకు తెలియదన్నారు. తాను కాంగ్రెసు పార్టీలో కొనసాగడంపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆళ్లగడ్డకు మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ఇంచార్జులుగా ఉన్న విషయం తనకు తెలియదని చెప్పారు.
ద్వంద్వ ప్రమాణాలు ఉన్న కాంగ్రెసు పార్టీలో కొనసాగలేక పోవచ్చునని గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర రెడ్డి చెప్పారు. రాజీనామా విషయం ఆళోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. కాగా గంగుల సోదరులు ఇద్దరూ రాజీనామా చేసి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.
కర్నూలు జిల్లాలో భూమా నాగి రెడ్డి, గంగుల ప్రతాప రెడ్డిల హావా బాగానే ఉంది. ఇప్పటికే భూమా నాగి రెడ్డి దంపతులు జగన్ పార్టీలో చేరారు. తాజాగా గంగుల సోదరులు కూడా జగన్ పార్టీలోకి వెళితే కర్నూలు జిల్లాలో కాంగ్రెసుకు కష్టాలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెసు మచ్చుకైనా కనిపించదని చెబుతున్నారు.