మంగళి కృష్ణ 12ఏళ్లుగా తెలుసు: భాను, కలిసే బిజినెస్

ఆయన సైఫాబాద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ అంశాలు వెల్లడించారట. సిఐ ఇండియా సాఫ్టువేర్ సంస్థ సెటిల్మెంట్ కేసులో 2006 నవంబర్ 19న తాను అరెస్టయ్యానని పోలీసు కస్టడీలో ఉన్న భాను చెప్పారని తెలుస్తోంది. కడపలో మద్యం వ్యాపారం చేసినప్పుడు మంగళి కృష్ణతో పరిచయమైందని, 2004లో అతడితో కలిసి హైదరాబాదులో వ్యాపారం చేసినట్లు చెప్పాడట.
మంగళి కృష్ణతో కలిసి భాను ఎన్నో వ్యాపార లావాదేవీల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేశారట. ఒకేసారి కొన్ని కంపెనీల్లో ఇరువురు డైరెక్టర్లుగా కొనసాగిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. సెటిల్మెంట్లు పూర్తి కాగానే వారు సదరు కంపెనీల నుంచి తప్పుకొంటారు. ఇప్పటికీ వారిద్దరు కలిసి రెండు కంపెనీలు నడిపిస్తున్నారట.
అంతకుముందు ఇద్దరికి పరిచయం ఉన్నప్పటికీ వ్యాపార సంబంధం బలపడింది మాత్రం 2006లో అని తెలుస్తోంది. 2009లో ఓ కంపెనీలో భాను, కృష్ణ ఒకేసారి డైరెక్టర్లుగా చేరారట. ఇప్పటికీ ఆ కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో భాను 52 ఎకరాలు కొనగా, కృష్ణ 10 ఎకరాలు కొన్నాడు. ఇక్కడే ప్రముఖ తెలుగు హీరో కుటుంబం, మరో ఇద్దరు నిర్మాతలూ కొంత భూమి కొనేందుకు అడ్వాన్సు ఇచ్చారట.
అయితే ఇది రిజిస్ట్రేషన్ మాత్రం భానుకు జరిగిందని, ఇది సెటిల్మెంటు వ్యవహారమేనని అనుమానిస్తున్నారు. మరికొన్ని కంపెనీలలో డైరెక్టర్లు మారకున్నప్పటికీ పరోక్షంగా అవి భాను సంస్థలేనట. భాను, సూరి కలిసి ఏర్పాటు చేసిన ఓ కంపెనీ అడ్రస్లోనే మరో మరో సంస్థ చిరునామా ఉందట. దీంతో దీనిని కూడా భానుయే ఏర్పాటు చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications