రాక్షసత్వానికి ప్రతిరూపం చంద్రబాబు: జగన్ పార్టీ నేత
రాక్షస పుట్టుకకు చంద్రబాబు ప్రతిరూపం అన్నారు. వైయస్ ఎస్సీలకు వ్యతిరేకమని చంద్రబాబు ప్రచారం చేశారని, కానీ ప్రజలు నమ్మలేదన్నారు. ఎస్సీ అస్త్రం విఫలమవడంతో ఎస్టీ అస్త్రం బాబు పట్టుకున్నారని, అదీ విఫలమవడంతో బిసి కార్డు పట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ వర్గాలకు ఏం చేశారో చెప్పాలన్నారు.
బిసిలు ప్రాణప్రదంగా చూసుకునే కుల వృత్తులను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. బిసిల్లో ఉన్న సన్న, చిన్నకారు రైతులను దగా చేశారన్నారు. వైయస్ సువర్ణయుగంలో పేదరికాన్ని నిర్మూలిస్తే చంద్రబాబు రాక్షస పాలనలో పేదల్ని మట్టుబెట్టారన్నారు. హైదరాబాద్కు బిల్ క్లింటన్ వస్తున్నారని చెప్పి పేదలైన బిసి, ఎస్సీ, ఎస్టీ ప్రజలను కుక్కల మాదిరిగా వాహనాలలో తరలించిన విషయం రాష్ట్ర ప్రజలకు గుర్తుందని చెప్పారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బలుపెక్కి చనిపోతున్నారని, డబ్బుకోసమే ఆత్మహత్య చేసుకుంటున్నారని బాబు అవమానించారన్నారు. బాబు తన హయాంలో ఆదరణ పథకం ద్వారా టిడిపి కార్యకర్తలకు దోచిపెట్టారన్నారు. వైయస్ రాజకీయ వారసుడిగా ప్రజలు జగన్ను చూస్తున్నారన్నారు.
వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర రావులు నెల జీతగాళ్లని టిడిపి నేత శోభా హైమావతి చేసిన వ్యాఖ్యలను గట్టు ఖండించారు. జూపూడి చేసిన ప్రజా ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడిన టిడిపి నేతలు ఆయన వైయస్సార్ కాంగ్రెసులో చేరగానే నెల జీతగాడయ్యాడా అని ప్రశ్నించారు. డబ్బుతో వ్యక్తులను కొనుగోలు చేసే నీచబుద్ది చంద్రబాబుదే అన్నారు.