వైయస్ చేసిందే నేను సాక్షిపై చేశా: జగన్పై సిఎం

తండ్రిని ప్రభావితం చేసి బల్ల కింద సంతకాలు చేయించారు కాబట్టే వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. బల్ల కింద సంతకాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. తాను కచ్చితంగా ఉంటానని, నిక్కచ్చిగా మాట్లాడుతానని ఆయన చెప్పారు. టేబుల్ కింది పనులు తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. జగన్ తన పత్రిక ద్వారా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన శనివారం సాయంత్రం ప్రసంగించారు.
కాంగ్రెసుకు బద్ధ శత్రువైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో చేతులు కలిపిన వైయస్ జగన్ ఆదేశాల మేరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన అన్నారు. ఇది జగన్ వర్గం శాసనసభ్యులు చేసిన త్యాగం కాదని, నీతిమాలిన చర్య అని, రాజ్యాంగ విరుద్ధమైన పని, అందుకే వారి సభ్యత్వం రద్దయిందని ఆయన అన్నారు.
ఇదంతా కాంగ్రెసు పార్టీ అధికారం నుంచి దించి, వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు. సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు రాస్తున్నారని, సాక్షి మీడియాలో అబద్దాలు వస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మబోరని, పత్రికలనూ టీవీ చానెళ్లనూ ప్రజలు నమ్మేట్లయితే కాంగ్రెసు అధికారంలోకి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. టీవీ చానెల్, పత్రికలతో ప్రజలను మభ్య పెడుతామంటే కుదరదని ఆయన అన్నారు.
వైయస్ జగన్వి నీతి నిజాయితీ లేని మాటలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ పేరు చెప్పుకోలని వ్యక్తి జనగ్ అని ఆనయ అన్నారు. తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిని అరెస్టు చేయడమేమిటని జగన్ అడగడం విడ్డూరమని ఆయన అన్నారు. అవినీతి సొమ్మును వెనకేసుకున్న జగన్కు మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications