విచారణకు గడువు కోరుతూ జగన్ లేఖ, సిబిఐ నో

జగన్ ఉప ఎన్నికల బిజీలో ఉన్నందున వచ్చే నెల అనగా జూన్ 15వ తేదిన విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని గడువు కోరారు. అయితే జగన్ తరఫు న్యాయవాదులు ఇచ్చిన లేఖను సిబిఐ అధికారులు తీసుకోలేదని తెలుస్తోంది. సంబంధింత అధికారులు లేనందున తాము లేఖ తీసుకోలేదని సిబిఐ కార్యాలయ వర్గాలు జగన్ తరఫు న్యాయవాదులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు తమ ఎదుట ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించేందుకు సిబిఐ అధికారులు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని అధికారులు జగన్ను కోరారు. అందుకు జగన్ ఉదయం పదకొండు గంటలకు రెంటచింతల చర్చిలో తనను కలవాలని సిబిఐకి చెప్పారు.
దీంతో వారు పదకొండు గంటల సమయంలో రెంటచింతల చర్చిలో జగన్కు నోటీసులు అందజేసే అవకాశాలు ఉన్నాయి. సిబిఐ అధికారులు మాచర్ల నుండి రెంటచింతలకు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కాగా జగన్కు సిబిఐ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన అరెస్టు 28 కంటే ముందే జరగనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా తాను 25న విచారణకు సిబిఐ ఎదుట హాజరు కాలేనని, అందుకు తనకు మినహాయింపు ఇవ్వాలని, ఉప ఎన్నికలు పూర్తయ్యాక జూన్ 15న తాను విచారణకు హాజరవుతానని జగన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎనిమిదిన్నర నెలలుగా సిబిఐ విచారణ జరుగుతున్నా తనను విచారణకు పిలవలేదని, 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపించిందని, ఉప ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ తరఫున ప్రచారం బాధ్యతలు నిర్వహించాల్సి ఉందని, కాబట్టి తనకు ఉప ఎన్నికల తర్వాత హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ పిటిషన్ లో కోరారు. ఈ సమయంలో సమన్లు, నోటీసులు సరికాదన్నారు. కాబట్టి తనకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి.
మరోవైపు మంత్రి మోపిదేవి వెంకట రమణ పదకొండు గంటలకు సిబిఐ ఎదుట హాజరు కానున్నారు. వాన్ పిక్ కు భూకేటాయింపులపై మోపిదేవిని సిబిఐ ప్రశ్నించనుంది.












Click it and Unblock the Notifications