ఉప పోరులో కాంగ్రెసుకు కష్టకాలం: చిరంజీవే ఆశ

కాంగ్రెసు ఏదో మేరకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కుంటున్న సమయంలో కాంగ్రెసు నాయకత్వం కుల సమీకరణాలతో నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఉప ఎన్నికలకు ముందే విద్యుత్ చార్జీలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను కూడా పెంచి ప్రజలపై గుదిబండను మోపింది. ఇవి కాంగ్రెసుకు వ్యతిరేకంగా పని చేసే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో వేసవి మండిపోతోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు నీటికి కటకటలాడుతున్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేదు. దీంతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రకాశం జిల్లాను తీసుకుంటే, రైళ్లలో వెళ్లి ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఏ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు.
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు శాసనసభ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతున్న నెల్లూరు లోకసభ పరిధిలో ఉంది. దీంతో కాంగ్రెసుపై నీటి ఎద్దడి ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని అంటున్నారు. కందుకూరు నియోజకవర్గానికి మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, ఎమ్మగనూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లోని ప్రజలు కూడా అదే రకమైన సమస్యలు ఎదుర్కుంటున్నారు. కుండ నీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. అయితే, ఇందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను కాంగ్రెసు నాయకులు తప్పు పడుతున్నారు.
ఉప ఎన్నికలు వచ్చే వరకు తిరుపతి మినహా అన్ని స్థానాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. వారు నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని కాంగ్రెసు నాయకులు వాదిస్తున్నారు. అయితే, ఆ వాదన కాంగ్రెసుకే ఎదురు తిరుగుతోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే తాము బయటకు రావాల్సి వచ్చిందని, తమ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే తాము కాంగ్రెసులో కొనసాగలేకపోయామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులంటున్నారు.
ఆత్మరక్షణలో పడిన కాంగ్రెసు పార్టీ కుల సమీకరణాలపై ప్రధానంగా ఆధారపడింది. అందులోనూ వారికి చిరంజీవి మాత్రమే ఆశరేఖగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్రలో కాంగ్రెసు కాపు సామాజికవర్గంపై ఆధారపడింది. ఈ స్థితిలో కాంగ్రెసుకు ఒకటి, రెండు సీట్లయినా వస్తాయా అనేది అనుమానంగానే ఉంది. అయితే, చిరంజీవి కొన్ని సీట్లలో గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు.
లిక్కర్ సిండికేట్ల వ్యవహారం, ఇసుక మాఫియా వంటి సమస్యలను కూడా కాంగ్రెసు పార్టీ ఎదుర్కుంటోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంత్రిగా అంటూ మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లారు. దీంతో బిసిలు కొంత మేరకు కాంగ్రెసు పట్ల అసంతృప్తితో ఉన్నారు.
చిరంజీవి దృష్టి పెట్టిన నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం ఒకటి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కాంగ్రెసు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడి విజయం కోసం చిరంజీవి విశేషంగా కృషి చేస్తున్నారు. దానికితోడు కొత్తపల్లి సుబ్బారాయుడికి వ్యక్తిగతంగా బలం ఉంది.












Click it and Unblock the Notifications