తిరుపతి: భూమన దూసుకుపోతారా, దెబ్బ తింటారా?

మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో 12 మంది ఇండిపెండెంట్లే. నియోజకవర్గంలో అత్యధికంగా 40 వేల మంది బలిజ, కాపు కులస్థులున్నారు. తరువాత స్థానం యాదవులు , రెడ్లు , కమ్మ , ఎస్సీ, ఎస్టిలు , బ్రాహ్మణులు , రజకులు, నాయీ బ్రాహ్మణులు 14వేల మంది ఉన్నారు. వడ్డెర, శాలివాహన, క్షత్రియ తదితర కులస్థులు 50 నుండి 75వేల వరకు ఉంటారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల్లో తెలుగుదేశం అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి బలిజ కులస్థుడు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఎం వెంకటరమణ దాసరి బలిజ కులస్థుడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన్ కరుణాకర్రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.
సిపిఎంకు చెందిన అభ్యర్థి బిసి సామాజికవర్గానికి చెందిన రజక కులానికి చెందిన నేత. బిజెపి అభ్యర్థి కూడా బిసి వర్గానికి చెందిన వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి. బలిజ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఇటు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు చీల్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో బిసిలు ఎవరి పక్షాన నిలిస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుందని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ కూడా తాను బిసినేనంటూ చెప్పుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పట్ల ఉన్న అభిమానంతో అంతర్లీనంగా భూమన కరుణాకర్రెడ్డి వైపు అన్ని కులాల వారు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం ఉంది. ప్రచారంలోకి కూడా అందరికన్నా ముందుగా దిగారు. నాలుగు నెలలుగా ఆయన ఇంటింటి ప్రచారంలో వార్డు బాట పట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాన్ని ఎత్తి చూపి తనకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటున్నారు.
చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం అభ్యర్థిగా తెరపైకి వచ్చి తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. టిడిపి గెలుపు కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మూడు పర్యాయాలు తిరుపతిలో రోడ్షోలు నిర్వహించారు. చదలవాడ కూడా అధినేత చంద్రబాబుకన్నా గొప్పగా విశేష ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర భూగర్భగనులశాఖా మంత్రి గల్లా అరుణకుమారి తన కుమారుడు గల్లా జయదేవ్ను ఆరు నూరైనా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సర్వశక్తులు వొడ్డారు. ముఖ్యమంత్రి పట్టుదలతో కాంగ్రెస్ టిక్కెట్టు వెంకటరమణను వరించింది. టిక్కెట్టుతో పాటు పార్టీలో లెక్కకు మించిన అసంతృప్తి వాదులను కూడా అందుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారమే అందరికన్నా వెనుకగా ప్రారంభమైంది.
పట్టుపట్టి అధిష్ఠానం వద్ద వెంకటరమణ పేరును ఓకే చేసుకున్న సిఎం కిరణ్కు తిరుపతి గెలుపుప్రతిష్ఠగా మారింది. మంత్రులు మందీ మార్బలంతో విస్తృత ప్రచారం చేయిస్తూనే పార్టీలో ఉన్న అసంతృప్తిని అణిచివేయడానికి తన సోదరులతో రాయబారాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారు. చాప కింద నీరులా సిపిఎం అభ్యర్థి కందారపు మురళి తన సామాజిక వర్గ రజకులనే కాకుండా కార్మిక, ఉద్యోగ సంఘాలను, ముఖ్యంగా టిటిడిలోని ఒక వర్గానికి చెందిన వర్గానికి చెందిన ఉద్యోగులను తమ వైపుమలుచుకుంటున్నారు. సుమారు 8 నుండి 12వేల ఓట్లను సిపిఎం అభ్యర్థి చీల్చే అవకాశాలున్నాయి.
బిజెపి అభ్యర్థి కూడా ఎంత తక్కువ అనుకున్నా నాలుగైదువేల ఓట్లు చీల్చే అవకాశం ఉంది. గెలిచేవారిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరో ఒకరైనప్పటికి వీలైనన్ని ఎక్కువ ఓట్లను పొంది తిరుపతిలో తమ పార్టీ బలం ఎలా పెరుగుతుందో చాటుకోవడం కోసమే సిపిఎం, బిజెపి అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తాము ఓడిపోతామని తెలిసినా ప్రచారంలో ప్రధాన పార్టీలకు తీసిపోకుండా విస్తృతంగా ముందుకు సాగి తమ ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంటున్నారు.












Click it and Unblock the Notifications