మార్పులుచేస్తాం: కిరణ్, వారికి ఓటేస్తే కన్నీళ్లు..చిరంజీవి
సంక్షేమ పథకాలు, అభివృద్ధియే తమను గెలిపిస్తుందని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పదే పదే రాజీనామా చేయకుండా త్వరలో ఓ చట్టం తేనున్నట్లు కిరణ్ చెప్పారు. చట్టంలో అందుకు అనుకూలంగా మార్పులు చేస్తామని చెప్పారు. క్విడ్ ప్రో కో ఉదంతంలో మంత్రులపై ఆరోపణలు రుజువు కాలేదని చెప్పారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు పరిష్కారాలు ఆలోచిస్తున్నామని చెప్పారు.
ఉప ఎన్నికలు అవినీతికి, నీతికి మధ్య జరుగుతున్న పోరు అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పాయకరావుపేటలో అన్నారు. ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో కలిపి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కోటలు బీటలు వారేలు ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే కష్టాలు, కన్నీళ్లే మిగులుతాయన్నారు.
వైయస్ జగన్కు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లే అన్నారు. వైయస్ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని పిసిసి చీఫ్ బొత్స అన్నారు. కొడుకుకు రాజ్యాధికారం కట్టబెట్టడం కోసం పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. జగన్ అవినీతిని సమర్థించవద్దని కేంద్రమంత్రి పురంధేశ్వరి శ్రీకాకుళం జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. జగన్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు.
దళితులు అంతా కాంగ్రెసు వైపే ఉన్నారని అనంతపురంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసుదే గెలుపు అన్నారు. వైయస్ జగన్ అవినీతిపరుడని సిబిఐ, కోర్టులే చెబుతున్నాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లినంత మాత్రాన సానుభూతి రాదన్నారు.