పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయను: లోక్సత్తా జెపి

తాను జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానని, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తాను పోటీ చేయడం లేదని, జాతీయ స్థాయిలో పని చేస్తానని, పార్టీ సంస్థాగత ఎన్నికలను స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో.. రహస్య బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి 15 మంది క్రియాశీల సభ్యులకు ఒక జిల్లా ప్రతినిధి, ప్రతి 50 మంది క్రియాశీల సభ్యులకు ఒక రాష్ట్ర ప్రతినిధిని ఎన్నుకుంటారని చెప్పారు.
నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వీరితోనే ఎన్నికవుతాయన్నారు. పార్టీలో తన కంటే సమర్థులు చాలా మంది ఉన్నారని, వారికి అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. గుంపులు, ప్రాంతాలు, కులాల వారీగా ప్రేరేపించిన వారిని, ఓటర్లయిన సభ్యులను ప్రలోభాలకు గురి చేసిన వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పారు. అవినీతి రాజ్యం అంతానికి లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో సురాజ్య ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ ఉద్యమానికి రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఆగస్టు 9న క్విట్ కరప్షన్ డేను నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం వరకు వివిధ కార్యక్రమాలతో తొలి దశ సురాజ్య ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ ఉద్యమంలో కోటి మందిని భాగస్వాములను చేస్తామన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పులు తేవడం, దామాషా ఎన్నికల వ్యవస్థను తీసుకురావడం వంటి లక్ష్యాల సాధన కోసమే వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు.
ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర, సామరస్య పరిష్కారంలో భాగంగా వచ్చే తెలంగాణను తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. తెలంగాణపై తేల్చాల్సింది రాష్ట్రంలోని 8 పార్టీలేనని చెప్పారు. కాగా.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ప్రమాదంపై జేపీ విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సాంప్రదాయ పార్టీల వైఫల్యం వల్లే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.












Click it and Unblock the Notifications