కొడాలి నానిపై దూకుడు: వల్లభనేని వంశీ గైర్హాజర్

మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా నాయకులు దాదాపుగా అందరూ హాజరయ్యారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం మీడియా సమావేశంలో కూర్చోలేదు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మాత్రం ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కొడాలి నానికి వల్లభనేని వంశీ అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా, కొడాలి నానితో పాటు వంశీ కూడా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుయాయులు. తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణతో చర్చలు జరిపినవారిలో కొడాలి నానితో పాటు వంశీ కూడా ఉన్నట్లు చెబుతారు.
విజయవాడ రోడ్డుపై వైయస్ జగన్ను కలుసుకుని తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించిన వంశీ తర్వాత వెనక్కి తగ్గారు. జగన్ను కలవడంపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి వివరణ ఇచ్చి, తాను పార్టీలోనే కొనసాగుతానని నమ్మబలికారు. ఆ తర్వాత విజయవాడ ఫ్లైఓవర్పై చంద్రబాబు చేసిన ధర్నా కార్యక్రమంలో కూడా ఆయన ప్రముఖంగా కనిపించారు. నాని మాత్రం ఈ సమావేశానికి రాలేదు.
అయితే, వంశీకి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమమహేశ్వర రావుకు మధ్య విభేదాలున్నాయి. మీడియా సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని ఉమా మహేశ్వర రావు నాయకత్వం వహించారు. గద్దె రామ్మోహన్ రావు, రాజేంద్ర ప్రసాద్, ఇతర జిల్లా పార్టీ నాయకులు కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిత్రుడు కొడాలి నానిపై విమర్శలు చేయడం ఇష్టం లేకనో, దేవినేని ఉమతో ఉన్న విభేదాల వల్లనో వంశీ మీడియా సమావేశానికి రాలేదని అంటున్నారు. అయితే, వంశీ గైర్హాజరీపై మాత్రం గుసగుసలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications