నా మనవడు తెలుగులో మాట్లాడే విధంగా...: చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగిస్తానని, ఇంటి నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. తన మనవడు, మనవరాలు తెలుగులో మాట్లాడే విధంగా చూస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాష్ట్రంలో కన్నా విదేశాలలోనే ఎక్కువగా ఫరిడవిల్లుతోందని, మారిషస్ దేశమే అందుకు నిదర్శనమని అన్నారు. త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తానని చెప్పారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు బిల్లీ మౌర్య మాట్లాడుతూ.. తెలుగు చరిత్ర గొప్పదని, తన బాల్యం అంతా హైదరాబాదులోనే గడిపానని చెప్పారు. బ్రిటన్లో 24 మంది భారత సంతతికి చెందిన వారు పార్లమెంటుకు ఎన్నికయ్యారన్నారు. తెలుగు చరిత్రను పరిరక్షించడానికి కృషి చేసిన బ్రిటన్కు చెందిన కాటన్, బ్రౌన్, మెకంజీ తదితరుల సేవలను మహాసభల కమిటీ చైర్మన్ బుద్ద ప్రసాద్ వివరించారు.
భారత జాతి చరిత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, అందులో తెలుగువారి చరిత్ర మూడువేల సంవత్సరాల కిందటిదని బ్రిటన్ విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగ మంత్రి అలిస్టర్ బెర్ట్ అన్నారు. బ్రిటన్లో 15 లక్షల భారతీయులు ఉండగా వారిలో తెలుగువారు ప్రముఖ స్థానాలలో ఉన్నారన్నారు. తెలుగు జాతి చరిత్ర గొప్పదని, బ్రిటిష్ మ్యూజియం, గ్రంథాలయాలలో తెలుగు చరిత్రను ప్రతిబింబించే అనేక శాసనాలు, కళాఖండాలు ఉన్నాయని చెప్పారు.