దూసుకు పోతున్న ప్రణబ్, ఎపి నుండి 182-3
ఎంపీల ఓట్ల కౌంటిగ్ విషయానికి వస్తే దాదాకు 3,27,116 ఓట్లు, సంగ్మాకు 1,45,848 ఓట్లు వచ్చాయి. ప్రణబ్ ఓటింగ్ శాతం 70.5 కాగా, సంగ్మా ఓటింగ్ శాతం 27.5గా ఉంది. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408. మొత్తం ఓట్ల విలువ 10,98,882. ఇప్పటికే ఎంపీలతో భారీ ఓట్లు దక్కించుకున్న ప్రణబ్ ఎమ్మెల్యేల ఓట్లలో 1,76,426 ఓట్లు దక్కించుకున్నా గెలుస్తారు.
కానీ ఆయనకు భారీగా ఓట్లు వచ్చే అవకాశముంది. దాదాకు ఏడు లక్షలకు పైగా ఓట్ కౌంట్ వచ్చే అవకాశముంది. వార్త రాసే సమయానికి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎపి నుండి ప్రణబ్ కు 182, సంగ్మాకు 3 ఓట్లు వచ్చాయి. 190 ఓట్లు పోలవగా 5 ఓట్లు చెల్లలేదు. మన రాష్ట్రం నుండి ప్రణబ్కు 36,936 ఓట్ల కౌంట్ రాగా, సంగ్మాకు 608 ఓట్ల కౌంట్ వచ్చింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో 59 ఓట్లు ఉండగా దాదాకు 54, సంగ్మాకు 2 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లలేదు.
కాగా ప్రణబ్ గెలుపు లాంచనమే కావడంతో ఆయన నివాసం ఉన్న రహదారిలో కోలాహలం నెలకొంది. ఆయన ఇప్పుడున్న నివాసం వదిలి రాష్ట్రపతి భవనంకు మకాం మార్చనున్నారు. ప్రణబ్కు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా కాంగ్రెసు నేతలు తరలి వస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రానున్నారని తెలుస్తోంది. ఆయన 25న పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు.