బైరెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం: ఎర్రబెల్లి, బాబుపై కెటిఆర్ ఫైర్
తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖనే మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని, తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరింత స్పష్టత ఇస్తారని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు త్వరలో కేంద్రానికి లేఖ రాస్తారని ఆయన చెప్పారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాటల్లో తప్పు లేదని, రాయలసీమ ప్రజల అభిప్రాయాన్నే బైరెడ్డి చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకూడదని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పలేదని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. బైరెడ్డి వ్యాఖ్యల వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించారని, ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇస్తే రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఇవ్వాలని అడుగుతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. తాము ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఉంటే రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని, విభజించదలిస్తే మూడుగా విభజించాలని ఆయన అన్నారు.