సిఎం రేసు నుంచి తప్పుకున్న జైపాల్ రెడ్డి
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు లేవని, కేంద్రమంత్రిగానే కొనసాగుతానని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలనేది తన కల అని, దాన్ని కలగానే ఉండనివ్వాలని ఆయన అన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా వస్తే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకోవాల్సి వస్తుందని, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అది జీవితాంతం వేధిస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఇష్టపడకపోవడానికి దీన్ని ఓ కారణంగా చెబుతున్నారు.
అదే సమయంలో తెలంగాణ విషయం కూడా తన మెడకు చుట్టుకుంటుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా వస్తే తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రమంత్రి జైపాల్రెడ్డికి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్కు మధ్యనే ప్రధానంగా పోటీ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జైపాల్రెడ్డి కూడా మొదట్లో ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ‘ఫెయిల్యూర్ సిఎం' అనిపించుకోవడం ఇష్టం లేదంటూ మనసు మార్చుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి శ్రీనివాస్కు కొత్త పోటీ దారులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.