విహెచ్ దీక్షకు మద్దతు, తప్పు కాదన్న కెకె, డిఎల్

తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక్కసారి మేధోమథనం జరిగిందని, మరోసారి అది జరగాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కావడానికి సీనియర్ల సలహాలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు. విహెచ్ దీక్ష పార్టీకి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే సెప్టంబర్ నెలలోగా తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక ఇచ్చిందనే వార్తలను ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. నివేదికలు ఎలా ఉన్నా కావాల్సింది రాజకీయ నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేనని, అయితే తెలంగాణ ఇస్తేనే పార్టీకి లాభమనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు.
పార్టీ కోసం విహెచ్ దీక్ష చేపట్టడంలో తప్పు లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తమ పార్టీ మహా సముద్రమని, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారని, వాటి గురించి తాము మాట్లాడలేమని ఆయన అన్నారు. పార్టీలో మూడేళ్ల నుంచి జరుగుతున్న విషయాలను చర్చించుకుంటే తప్పేమిటని ఆయన అడిగారు. ఒక్కసారి మధోమథన సదస్సు నిర్వహిస్తే పని పూర్తవుతుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు విహెచ్ దీక్షకు మద్దతు తెలపడం గమనార్హం. ముఖ్యమంత్రి తీరుపై డిఎల్ రవీంద్రా రెడ్డి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్కు కోవర్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారా అని అడిగితే ఇది వరకే మాట్లాడానని, మళ్లీ మళ్లీ మాట్లాడితే బాగుండదని డిఎల్ రవీంద్రా రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. గాంధీభవన్ మెట్ల మీద విహెచ్ దీక్షను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications