ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోం: ముఖ్యమంత్రి

kiran kumar reddy
శ్రీకాకుళం: ప్రతిపక్షాల విమర్శలను తాము పరిగణలోకి తీసుకోవడంలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవని ఆయన ధ్వజమెత్తారు. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. ప్రజలు తమప్రభుత్వాన్ని నిండుమనసుతో ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఎరువుల ధరలు తగ్గింపునకు కేంద్రంపై వత్తిడి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధి పథకంవల్ల కూలీలకు మేలు జరిగినప్పటికీ కూలీల కొరతవల్ల రైతులకు పెట్టుబడులు అధికమవుతున్నాయని ఆయన అన్నారు. పెట్టుబడులు తగ్గించేందుకుగాను వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన శనివారం సీతంపేట మండలం మల్లి గురుకుల పాఠశాల నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభించారు.

ఉదయమే విద్యార్థులతో కలిసి క్రికెట్, షటిల్, వాలీబాల్ ఆటలాడిన సీఎం, మొక్కలు నాటి, గౌరవ వందనం స్వీకరించి పర్యటనకు శ్రీకారం చుట్టారు. పాతపట్నంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, దీనిపై కేంద్రంతో చర్చించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉపాధి పనులను వంద నుంచి నూటయాభై రోజులకు పెంచుతూ శ్రీకాకుళంలోనే నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలను ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో పద మూడు వేల కోట్ల రూపాయల బ్యాంకు లింకేజి రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.

ఉద్యోగాల నియామకంలో సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.దేశంలో మొట్టమొదటిగా రైతులకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఈ ఏడాది 95 లక్షల మంది రైతులకు 42 వేల కోట్ల రూపాయలు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వరి పంటకు గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులపై ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నదని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి త్వరలో చేనేత రంగ నిపుణులు, సంఘాల అధ్యక్షులతో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు కాగువాడ సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోండ్రు మురళీమోహన్, ఎంపీ కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు మీసాల నీలకంఠం నాయుడు, బొడ్డేపల్లి సత్యవతి, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులు, నిమ్మక సుగ్రీవులు, విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్దన తాట్రాజ్, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి త్రిపురాన వెంకటరత్నం తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+