పూణేలో వరుస బాంబు పేలుళ్లు: ఒకరికి గాయాలు
ఓ బాంబు చెత్తకుండీలోనూ, ఓ బాంబు సైకిల్ క్యారియర్లోనూ పేలాయి. డెటొనేటర్ సాయంతో వాటిని పేల్చినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక బృందం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అవునా, కాదా అనే విషయం తెలియడం లేదు. పేలుళ్లతో పూణేలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఇది ఉగ్రవాద చర్య కాదని పూణే పోలీసు కమిషనర్ గులాబ్ రావు పోల్ అన్నారు. అల్లరి మూకల పని అయి ఉంటుందని ఆయన అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా చెప్పుకోలేదు.
కాగా, కొత్త కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం సాయంత్రం పూణేలోని బాల గంధర్వ థియేటర్కు రావాల్సి ఉండింది. అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయింది. బాంబు స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుంది. పేలుళ్లు ఉగ్రవాద చర్య అని భావిస్తున్నారా అని అడిగితే ఈ సమయంలో వ్యాఖ్యానించడం సరి కాదని, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని మహారాష్ట్ర డిజిపి సంజీవ్ దయాళ్ అన్నారు.
పూణే బాంబు పేలుళ్లపై విచారణ జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ అధికారులతో సమావేశమై భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక బలగాల సిబ్బంది మెక్డోనాల్డ్ అవుట్ లెట్ వద్ద సిసిటివీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు.