జగన్ కేసు: చార్జిషీట్లో నిందితుడిగా మంత్రి ధర్మాన
వాన్పిక్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన చార్జిషీట్లో సిబిఐ 14 మంది నిందితులను చేర్చింది. సిబిఐ 117 పేజీలతో 284 డాక్యుమెంట్లతో ఈ చార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో వైయస్ జగన్ తొల ముద్దాయి కాగా, జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. మిగతా నిందితులు వరుసగా ఇలా ఉన్నారు - నిమ్మగడ్డ ప్రసాద్ (3), మోపిదేవి వెంకటరమణ (4), ధర్మాన ప్రసాద రావు (5), బ్రహ్మానంద రెడ్డి (6), ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ (7), మరో ఐఎఎస్ అధికారి శామ్యూల్ (8), నిమ్మగడ్డ ప్రకాష్ (9), వాన్పిక్ ప్రాజెక్టు (10), జగతి పబ్లికేషన్స్ (11), రఘురామ్ సిమెంట్స్ (12), కార్మిలేషియా (13), సిలికాన్ బిల్డర్స్ (14).
జీవోల విడుదల సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా పనిచేసినవారిపై కూడా సిబిఐ అభియోగాలు మోపింది. వాన్పిక్ ప్రాజెక్టు కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 15 వేల ఎకరాలకు పైగా భూములు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ ముడుపులుగానే జగన్కు చెందిన నాలుగు కంపెనీల్లో 854 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఇందుకు రెవన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు 9 జీవోలు చేశారని, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా మన్మోహన్ సింగ్, శామ్యూలు జీవోలపై సంతకాలు చేశారని సిబిఐ ఆరోపించింది. వీరు కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అభియోగం మోపింది.
ధర్మాన ప్రసాద రావు 2007, 2008, 2009ల్లో దురుద్దేశ్యవూర్వకంగానే నిమ్మగడ్డ ప్రసాద్కు మేలు చేస్తూ జీవోలు జారీ చేశారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు ప్రస్తుతం చంచల్గుడా జైలులో ఉండగా, విజయసాయి రెడ్డి బెయిల్పై బయటు ఉన్నారు. మే 15వ తేదీన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. మే 22వ తేదీన అప్పుడు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది. మే 27వ తేదీన వైయస్ జగన్ను అరెస్టు చేసింది. ధర్మాన ప్రసాద రావును సిబిఐ ఇప్పటికే మూడు సార్లు విచారించింది. అయితే, చార్జిషీటులో సిబిఐ తనను నిందితుడిగా చేర్చడాన్ని ధర్మాన ప్రసాద రావు ఖండించారు.