'తెలంగాణ వద్దు, వైయస్ జగన్ను కట్టడి చేస్తాం'
ఈ సమావేశంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులతో పాటు కోర్ కమిటీ సభ్యులు అనుకూలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నదంటూ ప్రచారం సాగుతుండడంపై వారు చర్చించారు.
తెలంగాణపై, పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై వారు మాట్లాడుకున్నారు. వైయస్ జగన్ను కట్టడి చేయడానికే అధిష్టానం రాష్ట్ర విభజనకు అనుకూలంగా కదులుతోందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డిని ఎదుర్కోవడానికి రాష్ట్ర విభజనకు పూనుకోవద్దని వారు అధిష్టానానికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్గుకోవాలని కూడా వారు అనుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీ గెలుస్తుందనే గ్యారంటీ ఏమిటని ఓ పార్లమెంటు సభ్యుడు అడినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర విభజనకు పూనుకోవడం సమంజసం కాదని వారు అనుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి వాయలార్ రవి మూడు ప్రాంతాల పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.