భారత్ను అభివృద్ధిలో నడిపిస్తా: ప్రధాని మన్మోహన్
కరవు ప్రాంతాలలో అన్నదాతను ఆదుకుంటామని, వారికి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో ఉచిత మందులను ఆధునికీకరణిస్తామన్నారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయిస్తామన్నారు. దేశంలో దారిద్ర్యం, పేదరికం తొలగిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి నిరంతరం విద్యుత్ వచ్చే విధంగా ఐదేళ్లలో కృషి చేస్తామన్నారు. పారిశ్రామిక వర్గాలు కూడా అందుకు సహకరించాలని కోరారు.
దేశ ఆర్థిక అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమన్నారు. కరవు ప్రాంతాలలో రైతులను ఆదుకుంటామని చెప్పారు. భారత్ను అభివృద్ధిలో పయనింప చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. దేశ అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలియో రహిత దేశంగా భారత్ను నిర్మిస్తామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టిందని చెప్పారు. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు తెరుస్తామని చెప్పారు.
అసోం ఘర్షణలు జాతికి కళంకమన్నారు. అసోం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మహాత్మాహాంధీ నేతృత్వంలో భారత స్వాతంత్ర్యం కల నెరవేరిందని, దేశంలో పేదరికం, దారిద్ర్యం తొలగించాల్సి ఉందన్నారు. దేశ వృద్ధి రేటులో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. త్వరలో రాజీవ్ గృహ రుణ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. పేదలు, రైతులు, కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, వంద శాతం అక్షరాస్యత విషయంలో మనం ఇంకా సాధించాల్సి ఉందన్నారు.
లోక్ పాల్ బిల్లు తీసుకు రావడానికి యుపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధే మార్గంగా నక్సల్స్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జాతీయ భద్రతపై మరింత దృష్టి సారించాలన్నది పుణే ఘటన తెలుపుతోందన్నారు.